Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 దిన 30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట

1 ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు.

2 రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

3 ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు.

4 ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది.

5 ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.

6 రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు.

7 తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు.

8 మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు.

9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”

10 వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.

11 కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు.

12 యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేటట్టు యెహోవా హస్తం యూదా వారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించారు.

13 రెండవ నెలలో పులియని రొట్టె పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు.

14 యెరూషలేములో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలు తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు.

15 రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు.

16 దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు.

17 ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది.

18 ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!

19 పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.”

20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు.

21 యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.

22 యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.

23 సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు.

24 యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు.

25 అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు.

26 యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు.

27 లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ