అపొస్తలుల 7 - తెలుగు సమకాలీన అనువాదముస్తెఫను న్యాయసభను ఉద్దేశించి మాట్లాడుట 1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. 2 అందుకు అతడు, “సహోదరులారా మరియు తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, 3 ‘నీ దేశాన్ని మరియు నీ సొంత జనాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్లు’ అని చెప్పారు. 4 “కనుక అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు. 5 ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు. 6 దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ సంతతివారు తమది కాని పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాల వరకు బానిసలుగా వేధించబడతారు. 7 కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’ అని దేవుడు చెప్పారు. 8 అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కనుక అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా మరియు యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు. 9 “మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఐగుప్తుకు బానిసగా అమ్మివేసారు. 10 కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఐగుప్తు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కనుక ఫరో ఐగుప్తు దేశమంతటిమీద మరియు అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు. 11 “ఆ తర్వాత ఐగుప్తు మరియు కనాను దేశాలలో తీవ్రమైన కరువు వచ్చి, ప్రజలందరికి చాలా కష్టాలు కలిగాయి, అప్పుడు మన పితరులకు కరువు వల్ల ఆహారం దొరకలేదు. 12 యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఐగుప్తు దేశానికి పంపించాడు. 13 వారు రెండవ సారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు తెలియచేశాడు. అలాగే ఫరో యోసేపు కుటుంబం గురించి తెలుసుకున్నాడు. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రియైన యాకోబును, తన కుటుంబమంతటిని అనగా డెబ్బై ఐదు మందిని పిలిపించాడు. 15 అప్పుడు యాకోబు ఐగుప్తుకు వెళ్లాడు, అక్కడే అతడు మరియు మన పితరులు చనిపోయారు. 16 వారి మృతదేహాలను షెకెము అనే ఊరికి తెచ్చి అబ్రాహాము షెకెములోని హామోరు కుమారుల దగ్గర వెల ఇచ్చి కొన్న అదే స్థలంలోని సమాధిలో ఉంచారు. 17 “దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఐగుప్తులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు, ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు. 19 అతడు మన జాతి ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించి పుట్టిన తమ చంటిపిల్లలను చనిపోవడానికి పారవేయాలని మన పితరులను బలవంతం చేసి హింసించాడు. 20 “ఇలాంటి రోజులలో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది. 21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. 22 మోషే ఐగుప్తీయుల విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. 23 “మోషేకు నలభై ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. 24 అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఐగుప్తీయుని చంపి, వానికి ప్రతీకారం చేశాడు. 25 తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకొంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. 26 మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు. 27 “అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద అధికారిగా, న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? 28 ఆ ఈజిప్టు వానిని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. 29 మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు. 30 “నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో మండుచున్న ఒక పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు కనిపించాడు. 31 అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా, 32 ‘నేను మీ పితరుల దేవుడను, నేనే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను’ అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కనుక మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు. 33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ పాదాల నుండి చెప్పులు విప్పు. 34 ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూసాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కనుక రా! నేను నిన్ను తిరిగి ఐగుప్తు దేశానికి పంపుతాను’ అన్నారు. 35 “ ‘మా మీద అధికారిగా, న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా మరియు విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు. 36 అతడు ఐగుప్తులో, ఎర్ర సముద్రం దగ్గర మరియు నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్బుతాలను సూచక క్రియలను చేసి వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు. 37 “ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కొరకు లేవనెత్తుతాడు’ అని చెప్పాడు. 38 అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండ మీద తనతో మాట్లాడిన దూతతో మరియు మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు. 39 “కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఐగుప్తు వైపుకు తిరిగారు. 40 వారు అహరోనుతో, ‘మాకు ముందుండి నడిపించడానికి దైవాలను తయారుచేయి. ఎందుకంటే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొనివచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అన్నారు. 41 అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు. 42 అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర మరియు నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాలలో: “ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా? 43 మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు, రెఫాను అనే దేవత నక్షత్రాన్ని పూజించారు. అందుకే నేను మిమ్మల్ని శిక్షించడానికి బబులోను అవతలకు బానిసలుగా పంపుతాను,’ అని వ్రాయబడి ఉంది. 44 “దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది. 45 ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది. 46 దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కొరకు నివాసస్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవుణ్ణి అడిగాడు. 47 కానీ ఆయన కొరకు నివాసస్థలాన్ని సొలొమోను కట్టించాడు. 48 “అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు: 49 “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి నివాసస్థలాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? 50 వీటన్నిటిని చేసింది నాచేయి కాదా?’ 51 “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మరియు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. 52 మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. 53 దేవదూతల ద్వారా అందించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకొన్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. స్తెఫనును రాళ్లతో కొట్టుట 54 న్యాయసభ సభ్యులు ఈ మాటలు వినినప్పుడు, చాలా కోపంతో స్తెఫనును చూసి పండ్లు కొరికారు. 55 కానీ స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడి వైపు యేసు నిలబడి ఉండడం చూసాడు. 56 అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం మరియు మనుష్యకుమారుడు దేవుని కుడి వైపు నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. 57 అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, 58 పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. 60 తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.