న్యాయాధి 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంతోలా 1 అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు. 2 అతడు ఇరవై మూడు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు; తర్వాత అతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు. యాయీరు 3 అతని తర్వాత గిలాదు వాడైన యాయీరు లేచాడు, అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. 4 అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు పట్టణాలు అని పిలుస్తారు. 5 యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు. యెఫ్తా 6 ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు. 7 యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు, 8 వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు. 9 అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు. 10 అప్పుడు ఇశ్రాయేలీయులు, “మేము మా దేవున్ని విడిచి బయలు ప్రతిమలను సేవిస్తూ, మీకు విరోధంగా పాపం చేశాం” అని యెహోవాకు మొరపెట్టారు. 11 యెహోవా ఇశ్రాయేలీయులకు జవాబిస్తూ, “ఈజిప్టువారు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, 12 సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయుల మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని వారి చేతుల్లో నుండి కాపాడలేదా? 13 అయితే మీరు నన్ను విడిచి ఇతర దేవుళ్ళను సేవించారు కాబట్టి నేను మిమ్మల్ని ఇక కాపాడను. 14 వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు. 15 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు. 16 తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు. 17 ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు. 18 గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.