యెషయా 21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 1 సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు. 2 భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను. 3 కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను. 4 నా గుండె దడదడలాడుతుంది భయంతో వణుకు పుడుతుంది; నేను ఇష్టమైన సంధ్యవేళ నాకు భయం పుట్టించింది. 5 వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి. 6 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి. 7 అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.” 8 కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను. 9 చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ” 10 నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను. ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం 11 దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?” 12 కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు. అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం 13 అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: అరేబియా ఎడారిలో బసచేసే దెదానీయులైన యాత్రికులారా, 14 మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి; తేమా దేశ నివాసులారా, పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి. 15 ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి, ఎక్కుపెట్టిన బాణాల నుండి, తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు. 16 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది. 17 కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.