కీర్తన 12 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన. 1 యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యులంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు. 2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు. 3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి. 4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ ప్రజలు చెప్పుకొంటారు. 5 కాని యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు. కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.” 6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి. 7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు. 8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International