Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 25 - పవిత్ర బైబిల్


పెయోరు దగ్గర ఇశ్రాయేలీయులు

1 ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురుషులు మోయాబీ స్త్రీలతో లైంగిక పాపం చేయటం మొదలు పెట్టారు.

2-3 మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.

4 “ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా ఎదుట పడవేయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవా కోపగించడు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

5 ఇశ్రాయేలీయుల న్యాయమూర్తులతో “పెయోరులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొక్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని చంపేయాలి” అని మోషే చెప్పాడు.

6 ఆ సమయంలో మోషే, మరియు ఇశ్రాయేలు పెద్దలు అంతా సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ స్త్రీని తన ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. మోషే, మరియు పెద్దలు అందరు చూసేటట్టుగా వాడు ఇలా చేసాడు. మోషే, ఆ పెద్దలు చాల విచారపడ్డారు.

7 అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు.

8 ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఆ ఇశ్రాయేలు వానిని, మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఆ ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లిద్దర్నీ ఫీనెహాసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది.

9 ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.

10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

11 “యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. ప్రజల మధ్య నా మర్యాద కాపాడటానికి అతడు ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న ప్రకారం ప్రజలను చంపను.

12 కనుక నేను ఫీనెహాసుతో ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి.

13 అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసింది.”

14 మిద్యానీ స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు మగవాడు సాలు కుమారుడైన జిమ్రీ. షిమ్యోను వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు.

15 చంపబడిన మిద్యానీ స్త్రీ పేరు కొజ్బీ. ఆమె షూరు కూమార్తె. షూరు మిద్యానీ ప్రజల్లో నాయకుడు. అతడు తన వంశానికి పెద్ద.

16 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

17 “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి.

18 ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొలిచేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ నాయకుని కుమార్తె కొజ్బీని మీ వాడొకడు దాదాపు వివాహం చేసుకునేంత పని చేసారు వారు. అదే ఇశ్రాయేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీ. పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవుణ్ణి కొలిచిన కారణంగానే ఆ రోగం వచ్చింది.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan