Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 16 - పవిత్ర బైబిల్


మోషే మీద కొందరి నాయకుల తిరుగుబాటు

1 కోరహు, దాతాను, అబీరాము, ఓను అనువారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాములు సోదరులు, ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు). దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు.

2 ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు.

3 వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పుకోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచివారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు.

4 మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి).

5 అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు.

6 అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి.

7 రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.”

8 కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి.

9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా?

10 యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

11 నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.”

12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము.

13 పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు.

14 మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకొని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు ఏవి నీవు మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.”

15 అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు.

16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు.

17 మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.”

18 కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు.

19 కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది.

20 మోషే, అహరోనులతో యెహోవా

21 “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.

22 అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు.

23 అప్పుడు యెహోవా మోషేతో

24 “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు.

25 మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు.

26 మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”

27 కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు.

28 అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను.

29 ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం.

30 కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.”

31 మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది.

32 అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది.

33 వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లేకుండా పోయారు.

34 నాశనం చేయబడుతోన్న మనుష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు.

35 తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది.

36 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:

37-38 “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!”

39 కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలియాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలియాజరు. అప్పుడు ఆ వెడల్పు రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు.

40 మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.


అహరోను ప్రజల్ని రక్షించటం

41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.

42 మోషే, అహరోనులు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది.

43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.

44 అప్పుడు యెహోవా మోషేతో

45 “ఇప్పుడు నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.

46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.

47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు.

48 బ్రతికి ఉన్నవాళ్లకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది.

49 అయితే వారి పాపం నిమత్తం అహరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు.

50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan