యోహాను 5 - తెలుగు సమకాలీన అనువాదముకోనేటి దగ్గర స్వస్థత 1 కొంత కాలం తర్వాత, యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు. 2 యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. 3 ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం లాంటి రకరకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. [ 4 ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే, వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కనుక అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు.] 5 ముప్పైఎనిమిది సంవత్సరాలుగా కదలలేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు. 6 చాలాకాలంగా అతడు అదే స్థితిలో అక్కడ పడి ఉన్నాడని తెలుసుకున్న యేసు, అతన్ని చూసి, “నీవు బాగవ్వాలని కోరుతున్నావా?” అని అడిగారు. 7 ఆ కదల్లేనివాడు, “అయ్యా, నీరు కదిలినప్పుడు కోనేటిలోనికి దిగడానికి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను దానిలోనికి దిగడానికి ప్రయత్నించేలోపు, నాకన్నా ముందు మరొకరు దిగిపోతున్నారు” అని సమాధానం చెప్పాడు. 8 అప్పుడు యేసు వానితో, “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అన్నారు. 9 వెంటనే అతడు స్వస్థత పొంది, తన పరుపెత్తుకొని నడిచాడు. ఇది సబ్బాతు దినాన జరిగింది. 10 అందుకని యూదా నాయకులు స్వస్థత పొందినవానితో, “ఇది సబ్బాతు దినం కనుక నీవు పరుపును మోయడానికి ధర్మశాస్త్రం అనుమతించదు” అన్నారు. 11 అయితే అతడు, “నన్ను స్వస్థపరచినవాడు ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడని” అన్నాడు. 12 కనుక వారు అతన్ని, “నీకు పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు?” అని అడిగారు. 13 అయితే స్వస్థపడినవానికి ఆయన ఎవరో తెలియలేదు. ఎందుకంటే యేసు అక్కడ ఉన్న గుంపులోనికి వెళ్లిపోయారు. 14 తర్వాత యేసు వానిని దేవాలయంలో చూసి అతనితో, “చూడు, నీవు స్వస్థపడ్డావు. పాపం చేయకు లేకపోతే నీకు ఇంతకన్నా దారుణమైంది జరుగవచ్చు” అని చెప్పారు. 15 అతడు వెళ్లి యూదా నాయకులతో తనను బాగుచేసింది యేసు అని చెప్పాడు. కుమారుని యొక్క అధికారం 16 యేసు ఈ కార్యాలను సబ్బాతు దినాన చేశాడని యూదా నాయకులు ఆయనను హింసించారు. 17 యేసు వారికి సమాధానం ఇస్తూ, “నా తండ్రి నేటి వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నారు, నేను కూడా చేస్తున్నాను” అని చెప్పారు. 18 కనుక వారు, యేసు సబ్బాతు దినాన్ని పాటించకపోవడమే కాక దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ, తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడని ఆయనను చంపడానికి మరింత గట్టిగా ప్రయత్నించారు. 19 కనుక యేసు వారితో మాట్లాడుతూ, “నేను మీతో చెప్పేది నిజం, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు; తండ్రి చేస్తున్న దానిని చూసి కుమారుడు చేస్తాడు, ఎందుకంటే తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడు. 20 తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తాను చేసే వాటన్నిటిని కుమారునికి చూపిస్తారు. అవును, మీరు ఆశ్చర్యపడేంతగా, వీటికన్నా గొప్ప కార్యాలను తండ్రి కుమారునికి చూపిస్తారు. 21 తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తాను ఇవ్వాలనుకున్న వారికి జీవాన్ని ఇస్తారు. 22 అంతేకాక, తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు కానీ, తండ్రిని ఘనపరచినట్లే అందరు కుమారున్ని కూడా ఘనపరచాలి. 23 ఆయన అందరికి తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. కుమారుని ఘనపరచని వారు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచరు. 24 “నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మువాడు, నిత్యజీవం గలవాడు మరియు అతడు మరణం నుండి జీవంలోనికి దాటాడు కనుక అతనికి తీర్పు ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 25 మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 26 తండ్రి తనలో జీవం కలిగివున్న ప్రకారం, కుమారునిలో కూడా జీవం కలిగి ఉండేలా ఆయనకు అధికారం ఇచ్చారు. 27 మరియు ఆయన మనుష్యకుమారుడు కనుక తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇచ్చారు. 28 “దీని గురించి ఆశ్చర్యపడకండి, ఎందుకనగా ఒక సమయం వస్తుంది, అప్పుడు సమాధులలో ఉన్నవారందరు ఆయన స్వరాన్ని విని, 29 బయటకు వస్తారు, మంచి కార్యాలను చేసినవారు పునరుత్థాన జీవంలోనికి లేస్తారు, చెడు కార్యాలను చేసినవారు పునరుత్థాన శిక్ష పొందడానికి లేస్తారు. 30 నా అంతట నేనే ఏమి చేయలేను. నేను విన్న దానిని బట్టి తీర్పు తీరుస్తాను, నా తీర్పు న్యాయమైనది. ఎందుకంటే నన్ను పంపినవానిని సంతోషపెట్టడానికి నేను చేస్తాను తప్ప నన్ను సంతోషపెట్టుకోవడానికి కాదు. యేసును గురించి సాక్ష్యాలు 31 “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకొంటే నా సాక్ష్యం సత్యం కాదు. 32 నా పక్షాన సాక్ష్యం ఇచ్చేవాడు ఇంకొకడు ఉన్నాడు, అతడు నా గురించి ఇచ్చే సాక్ష్యం సత్యం అని నాకు తెలుసు. 33 “మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపినప్పుడు, అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. 34 నేను మనుష్యుల సాక్ష్యాన్ని కోరను కానీ, మీరు రక్షింపబడాలని దీనిని చెప్తున్నాను. 35 యోహాను మండుచూ వెలుగిచ్చే ఒక దీపం వంటివాడు, మీరు అతని వెలుగులో కొంత కాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు. 36 “అయితే యోహాను చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. అదేమంటే పూర్తి చేయమని తండ్రి నాకిచ్చిన పనులు అనగా నేను చేస్తున్న పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. 37 నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు, 38 ఆయన పంపినవానిని మీరు నమ్మరు కనుక ఆయన వాక్యం మీలో నివసించదు. 39 మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకొంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, 40 కాని జీవం పొందడానికి నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు. 41 “నేను మనుష్యుల మెప్పును అంగీకరించను. 42 అయితే నాకు మీ గురించి తెలుసు. మీ హృదయాల్లో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు. 43 నేను నా తండ్రి పేరట వచ్చాను కాని, మీరు నన్ను అంగీకరించలేదు; అయితే మరొకడు తన స్వంత పేరులో వచ్చినప్పుడు మీరు అతన్ని అంగీకరిస్తారు. 44 ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు? 45 “నేను తండ్రి ముందు మీ మీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీరు నిరీక్షణ ఉంచిన మోషేనే మీ మీద నేరం మోపుతాడు. 46 మీరు మోషేను నమ్మితే, నన్ను నమ్మి ఉండేవారు, ఎందుకంటే అతడు వ్రాసింది నా గురించే. 47 కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మడం లేదు, అలాంటప్పుడు నేను చెప్పేది ఎలా నమ్ముతారు?” |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.