అపొస్తలుల 4 - తెలుగు సమకాలీన అనువాదముయూదుల న్యాయసభ ముందుకు పేతురు యోహానులు 1 పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కాపలావారి అధిపతి మరియు సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. 2 అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. 3 వారు పేతురు యోహానులను పట్టుకొని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. 4 కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు ఐదువేల వరకు పెరిగింది. 5 మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. 6 ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు మరియు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. 7 వారు పేతురు యోహానులను తీసుకొనివచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. 8 అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! 9 మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, 10 మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. 11 లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ ‘ఇండ్లు కట్టే మీరు తృణీకరించిన రాయి అయిన యేసు, మూలరాయి అయ్యారు.’ 12 కనుక మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు. 13 వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని మామూలు మనుషులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతోపాటు ఉన్నవారని గుర్తించారు. 14 కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. 15 కనుక వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, 16 “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే ప్రతి ఒక్కరికి వీరు ఈ గొప్ప సూచక క్రియను చేశారని తెలుసు, కనుక అది జరగలేదని చెప్పలేము. 17 అయినా ఈ సంగతిని ప్రజలలో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. 18 మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. 19 అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేక దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. 20 మా మట్టుకైతే, మేము చూసినవాటిని మరియు విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. 21 ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కనుక వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. 22 అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. విశ్వాసులు ప్రార్థించుట 23 పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ప్రధాన యాజకులు మరియు యూదా నాయకులు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు. 24 అది విన్న వెంటనే, వారందరు ఏక మనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. 25 చాలా కాలం ముందే నీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘ఆయన యొక్క క్రీస్తుకు మరియు ప్రభువుకు వ్యతిరేకంగా 26 ఎందుకు భూలోక రాజులు లేస్తారు? అధికారులు ఒక్కటిగా చేరతారు? జనులు ఎందుకు అల్లరి రేపుతున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థంగా కుట్రపన్నుతున్నారు?’ 27 నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదులు కాని జనులతో మరియు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు మరియు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు. 28 ఏమి జరగాలని నీ శక్తి మరియు నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు. 29 ప్రభువా, ఇప్పుడు, వీరి బెదరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. 30 మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచక క్రియలు, అద్బుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.” 31 వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. విశ్వాసుల ఐక్యత 32 నమ్మినవారందరు ఒకే మనస్సుతో ఐక్యతతో కలిసి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్న వాటన్నింటిని అందరు పంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమివ్వడం కొనసాగించారు. వారందరిలో దేవుని కృప ఎంతో శక్తివంతంగా పనిచేస్తూవున్నది. 34 అవసరాన్ని బట్టి సమయానికి పొలాలు, ఇల్లు ఉన్నవారు వాటిని అమ్మి ఆ డబ్బును తెచ్చి, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 అది అవసరంలోవున్న వారికి పంచిపెట్టబడింది. కనుక వారి మధ్య అవసరంలోవున్న వారెవరు లేరు. 36 కుప్రకు చెందిన యోసేపు అనే ఒక లేవీయుడు ఉన్నాడు. అపొస్తలులు అతన్ని బర్నబా అని పిలిచేవారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థం. 37 అతడు తన పొలాలను అమ్మివేసి ఆ డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.