యోహాను 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంనీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు 1 మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. 2 యేసు, ఆయన శిష్యులు ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. 3 అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. 4 అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు. 5 ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది. 6 అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కోసం వాటిని వాడుతారు. ఒక్కొక్క దానిలో వంద లీటర్ల నీళ్లు పడతాయి. 7 యేసు, “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కాబట్టి ఆ పనివారు వాటిని అంచుల వరకు నింపారు. 8 ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, 9 ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశాడు. ఆ నీటిని తెచ్చిన పనివారికి తప్ప అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి, 10 “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు. 11 గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్భుతం చేసి తన మహిమను తెలియజేశారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు. 12 దీని తర్వాత యేసు తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్లారు. వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. యేసు దేవాలయ ఆవరణాన్ని శుభ్రపరచుట 13 యూదుల పస్కా పండుగ దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్లారు. 14 దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు పరదేశి డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చుని ఉండడం ఆయన చూశారు. 15 ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేశారు. 16 పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడినుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. 17 “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. 18 అప్పుడు యూదులు, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు. 19 యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు. 20 దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. 21 అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. 22 ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు. 23 పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూసిన చాలామంది ఆయన పేరును నమ్మారు. 24 అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు కాబట్టి, ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. 25 ప్రతి ఒక్కరి అంతరంగం ఏమిటో ఆయనకు తెలుసు, కాబట్టి మానవుల గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమిచ్చే అవసరం లేదు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.