Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆదికాండము 30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.

2 యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.

3 అప్పుడు ఆమె, “ఇదిగో, నా దాసి బిల్హా. ఈమెతో వెళ్లు, తద్వార ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆమె ద్వార నేను కూడా కుటుంబం కట్టుకుంటాను” అని చెప్పింది.

4 కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు.

5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది.

6 అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను అని పేరు పెట్టింది.

7 రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

8 అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

9 లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.

10 లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది.

11 అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!” అని అన్నది. కాబట్టి అతనికి గాదు అని పేరు పెట్టింది.

12 లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

13 అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.

14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.

15 అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది. రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది.

16 సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు.

17 దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది.

18 అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.

19 ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.

20 అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.

21 కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది.

22 తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు.

23 ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది.

24 ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టి, “యెహోవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇచ్చును గాక” అని అన్నది.


యాకోబు మందలు అధికమగుట

25 రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు.

26 నా భార్యలను, పిల్లలను నాతో పంపించు. వారి కోసమే నేను నీకు సేవ చేశాను, ఇక నేను వెళ్తాను. నేను ఎంతగా నీకోసం పని చేశానో నీకు తెలుసు” అని అన్నాడు.

27 అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను.

28 నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు.

29 యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు.

30 నేను రాకముందు నీకున్న కొంచెం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినది, నేను ఏ చోట ఉన్నా యెహోవా నిన్ను దీవించారు. అయితే, నా సొంత ఇంటివారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి?” అని అన్నాడు.

31 లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను:

32 ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు.

33 నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.

34 లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.

35 ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు.

36 అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.

37 అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.

38 తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి.

39 అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి.

40 యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు.

41 మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు.

42 ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి.

43 ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan