Online Bible

- Reklamy -

న్యాయాధి 20 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

2 దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.

3 ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు–ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని యడుగగా

4 చంప బడిన స్త్రీ పెనిమిటియైన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా–బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బసచేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా

5 గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి

6 నా ఉపపత్నిని బలవంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.

7 ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచనచేసి చెప్పుడనెను.

8 అప్పుడు జనులందరు ఏకీభవించి లేచి–మనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,

9 మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి

10 ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి.

11 కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయుటకు కూడిరి.

12 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మనుష్యులను పంపి–మీలో జరిగిన యీ చెడుతనమేమిటి?

13 గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక

14 యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.

15 ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందలమందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణములనుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.

16 ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగల వాడు.

17 బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.

18 వీరు లేచి బేతేలుకు పోయి–ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా– యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.

19 కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.

20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా

21 బెన్యామీనీయులు గిబియాలోనుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరువదిరెండు వేలమందిని నేల గూల్చిరి.

22 అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.

23 మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచు–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవావారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.

24 కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవదినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవదినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు

25 గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి.

26 వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించిరి.

27 ఆ దినములలో యెహోవా నిబంధనమందసము అక్కడనే యుండెను.

28 అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

29 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.

30 మూడవదినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియావారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా

31 బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.

32 బెన్యామీనీయులుమునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరిగాని ఇశ్రాయేలీయులు–మనము పారిపోయి వారిని పట్టణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.

33 ఇశ్రాయేలీయులందరు తమ చోటనుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి.

34 అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థెమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.

35 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యామీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువదియయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.

36 బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అప జయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి.

37 మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారినందరిని హతముచేసిరి.

38 ఇశ్రాయేలీయులకును మాటు గాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదే దనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే.

39 ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు–వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.

40 అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీయులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమున కెక్కుచుండెను.

41 ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది

42 యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణములలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.

43 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.

44 అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.

45 అప్పుడు మిగిలినవారు తిరిగి యెడారిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజమార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.

46 ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.

47 ఆరువందలమంది తిరిగి యెడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.

48 మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy